వైయస్ అవినాశ్ రెడ్డి వంటి వారు బీజేపీకి అవసరం లేదు: సోము వీర్రాజు

  • చర్చనీయాంశంగా మారిన వివేకా కూతురు సునీత వాంగ్మూలం
  • అవినాశ్ రెడ్డి బీజేపీలో చేరుతాడని జగన్ చెప్పారన్న సునీత
  • బీజేపీలో చేరుతానని అవినాశ్ ఎవరితో చెప్పాడో బయట పెట్టాలన్న సోము వీర్రాజు

మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకా కూతురు సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పలు విషయాలను వెల్లడించారు. 

తన తండ్రిని చంపింది ఎవరో పులివెందులలో అందరికీ తెలుసని... హంతకులెవరో తేల్చాలని జగన్ అన్నను కోరానని, అనుమానితుల పేర్లను కూడా చెప్పానని... అయితే వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావని జగన్ తనతో అన్నారని ఆమె తెలిపారు. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్నారని... కేసును సీబీఐకి ఇస్తే అవినాశ్ రెడ్డి బీజేపీలో చేరుతాడని జగన్ అన్నారని పేర్కొన్నారు. ఈ వాంగ్మూలం చర్చనీయాంశంగా మారింది. 

దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. అవినాశ్ రెడ్డి తమ పార్టీకి అవసరం లేదని అన్నారు. ఒకవేళ ఆయన బీజేపీలో చేరుతానని ఎవరితోనైనా అని ఉంటే... ఎవరితో అన్నారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అవినాశ్ రెడ్డి వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సిన అవసరం బీజేపీకి లేదని అన్నారు.

Somu Veerraju
BJP
YS Avinash Reddy
YSRCP

More Telugu News